ప్రతిష్ఠాత్మక ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 అవార్డ్స్ వేడుక ఈనెల 15, 16 తేదీల్లో దుబారులో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించి ఆదివారం జరిగిన ప్రెస్మీట్లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ,’దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక సైమా. గత 11 ఏళ్ళుగా ఈ వేడుకల్లో భాగమౌతున్నప్పటికీ ఇప్పుడే మొదలుపెట్టిన ఉత్సాహం, ఆనందం ఉంది. గ్లోబల్ ఫ్లాట్ ఫామ్కి చేరుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. ఈ వేడుకల్లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘సౌత్లో పని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి సైమాతో అసోసియేషన్ ఉంది. విష్ణు, బృందాకి థ్యాంక్స్. ఈ వేడుకల్లో లెజండరీ నటీనటులతో కలిసి వేదిక పంచుకోవడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది’ అని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ,’సైమా వేడుకల్లో పాల్గొనడం నాకు ఇదే మొదటిసారి. ఇది అవార్డుల వేడుకే కాదు సినిమాని ఒక పండగలా జరుపుకునే వేడుక. అన్ని చిత్ర పరిశ్రమలూ పండగలా జరుపుకునే ఈ వేడుక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. సైమా చైర్ పర్సన్ బందా ప్రసాద్ మాట్లాడుతూ,’సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీయూనియన్, హోమ్కమింగ్ లాంటిది. సైమా వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది. రానా లేకుండా ఈ వేడుకలను ఊహించుకోలేం. అందరి సహకారంతో ఈ వేడుకల్ని అద్భుతంగా నిర్వహిస్తాం’ అని అన్నారు.