కథానాయిక సమంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్స్టా గ్రామ్ వేదికగా సమంత అందరితో షేర్ చేసుకున్నారు. తండ్రి మరణంతో తీవ్ర విచారంలో ఉన్న ఆమె హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేస్తూ, ‘నాన్నా.. మళ్ళీ మనం కలిసేంత వరకూ..’ అని పేర్కొన్నారు.
సమంత తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ప్రమోషన్లో భాగంగా ఆమె తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని తెలిపారు.
‘చిన్న తనంలో నేను గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేస్తుండేదాన్ని. నేను ఏమీ తెలియని అమాయకురాలినని నా తండ్రి భావించేవారు. నన్నొక చిన్నపిల్లలా చూసేవారు. నటిగా రాణించిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతో గర్వపడ్డారు. నా పని విషయంలో ఎంతో సంతృప్తి చెందారు. నా జీవితంలో మా అమ్మానాన్నలు కీలక పాత్ర పోషించారు’ అని సమంత చెప్పారు. తండ్రి మరణం నేపథ్యంలో సమంతకు ధైర్యం చెబుతూ పలువురు సినీ ప్రముఖులతోపాటు ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టారు.