– రాహుల్, గైక్వాడ్, పడిక్కల్ విఫలం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా-ఏతో రెండో అనధికార టెస్టులో భారత్-ఏ బ్యాటర్ల ప్రదర్శన ఏమాత్రం మారలేదు. బౌలర్ల మెరుపులతో భారత్-ఏ రేసులోకి వచ్చినా బ్యాటింగ్ లైనప్ పూర్తిగా తేలిపోయింది. కెఎల్ రాహుల్ (10), అభిమన్యు ఈశ్వరన్ (17), సాయి సుదర్శన్ (3), రుతురాజ్ గైక్వాడ్ (11), దేవదత్ పడిక్కల్ (1) విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో భారత్-ఏ 31 ఓవర్లలో 73/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ధ్రువ్ జురెల్ (19 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (9 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ (4/50), ముకేశ్ కుమార్ (3/41) మెరవటంతో ఆసీస్-ఏ తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మార్కస్ హారిస్(74) అర్థ సెంచరీతో రాణించాడు. ఆసీస్-ఏ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్-ఏ 11 పరుగుల ముందంజలో కొనసాగుతుంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల ప్రదర్శనపైనే భారత్-ఏ ఆశలు పెట్టుకుంది.