సంఘ చైతన్య స్పూర్తి – వీరనారి ఐలమ్మ కీర్తి

Spirit of Sangha Chaitanya - Glory of Veeranari Ailammaఆత్మ గౌరవం
ధిక్కార స్వరం
తిరుగుబాటు పతాకం…
ధీశాలి చిట్యాల ఐలమ్మ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే సరిగ్గా సరిపోయే మాటలు.
సంఘ చేతనం…
ఐక్య సమరం..
సుస్పష్ట లక్ష్యం… పాలకుర్తి గురించి ప్రస్తావించాలంటే మదిపలికే పదాలివి.
ఇలా… ఐలమ్మ సాహసాన్ని – పాలకుర్తి ప్రస్థానాన్ని విడివిడిగా చూడటం సాధ్యం కాదు.
తెలంగాణ పేరును చరిత్రపుటల్లో శిలాక్షరాలుగా మార్చిన వీరతెలంగాణ సాయుధ సమరానికి సంఘ రూపం ఇచ్చిన… తొలి అడుగు జాడలు పాలకుర్తిలోనే పడ్డాయంటే ఆశ్చర్యం లేదు. అలాంటి పోరాటంలో ఒక మహిళ ధృవతారగా వెలిగిందనేది అతిశయోక్తి కాదు.
చింతల చెరువు జాడలు.. నల్ల తుమ్మల నీడలు.. ఎతైన గడి గోడలు. విస్నూరులో నేడు కనిపించె దృశ్యాలు ఇవే. కానీ… అక్కడి జాగీర్దారు అరచకాలు, నాటి భుస్వామ్య పెత్తందారుల అకృత్యాలన్నిటికి ప్రత్యక్ష సాక్షి. అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తికి కేవలం ఈ ప్రత్యేకత మాత్రమే ఉంటే దొరగీసిన గీతల్లోనే ఉండేదేమో ఈ గ్రామం. కానీ పదిహేనవ శతాబ్దంలోనే ప్రజాకవిగా పేరెళ్లిన పోతన ఊరు ”బమ్మెర” సైతం ఇక్కడికి కేవలం 3కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, కాకతీయుల యుగంలోనే గొప్ప విప్లవకవిగా వర్ధిల్లిన పాలకురికి సోమనాధుని జన్మస్థలం కావడంవల్ల కాబోలు… ఇక్కడి ప్రజల్లో సహజంగానే అన్యాయంపై తిరుగుబాటుతత్వం ఉందేమో. కాకుంటే… అరవై ఊర్లను శాశించే దొరకు కూత పెట్టు దూరంలో ఉండి, ఆచారాలు, కట్టుబాట్ల చట్రంలో కుమిలే సమయాన ఓ మహిళగా ఉండి, అర్ధాకలికి చిరునామాగా తోచే చాకలి కులంలో, పేదతనంలో ఉన్న వ్యక్తి ఐలమ్మ…. అగ్ని కణంలా లేచి, సంఘమై నిలవడం సాధారణ విషయం అసలేకాదు.
విస్నూరు దొర ఏలుబడిలోనే ఉన్న మల్లపల్లి ముఖ్తేదారు కొండల్‌రావుకు చెందిన, ఊరి చెరువుకింది భూమినే ఐలమ్మ కుటుంబం కౌలు చేసుకుంటూ జీవిస్తోంది.వెట్టిచాకిరి, దొరలు, నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ కార్యక్రమాలు విస్తరిస్తున్న కాలమది. 1944లో భువనగిరిలో జరిగిన సంఘం మహాసభల పిలుపుతోఉత్సహం పొందిన పల్లెలు సంఘం నీడన సంఘటిత మవుతున్నాయి. ఈ క్రమంలోనే పాలకుర్తిలోను ప్రజలు ఒక్కటి కాసాగారు. జీడి సొమయ్య నేతృత్వంలో ఆంధ్రమహాసభ శాఖ ఏర్పడింది. భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభకు సైతం అయన హాజరయ్యారు. సంఘం అండతో నిరక్షరాస్యులు చైతన్యవంతుయ్యారు. ఐలమ్మ తన ఇంటినే సంఘ కార్యక్రమాల కోసం ఇచ్చింది.
ఈ జన చైతన్యాన్ని దెబ్బకొట్టకపోతె… ముప్పని భావించిన దొరలు… కొత్త ఎత్తులు వేయసాగారు. చాకలివృత్తి వద్దనుకుని ఆత్మగౌరవంతో బతకాలని భావించే చిట్యాల ఐలమ్మ, నర్సయ్య దంపతులతో పాటు, కొందరు దళితులు, దూదేకుల ఖాసీంలు ఏండ్లుగా సాగుచేసుకున్న భూమిని స్థానిక పూజారి వెంకట రమణకు ఇనంగా రాసిచ్చే కుట్ర చేశారు దొరలు. వెంటనే విషయం తెలుసుకున్న జనం… ఇది సరైన పద్ధతి కాదని పూజారిని హెచ్చరించగా… భూస్వాముల అండతో… స్థానిక పోలీస్‌ పటేల్‌ శేషగిరిరావు గుండాలను దింపి సంఘం కార్యలయంపై దాడికి యత్నించారు. ప్రతివ్యుహంతో సిద్ధమైన సంఘం సభ్యులు…. వడిసెలు, రాళ్లతో సమరానికి సై అనగా… గుండెలు జారిన గుండాలు పారిపోయారు. ఈ జనచైతన్యం సెగ విస్నూరు గడిని తాకింది. అణుచరులపై గుర్రుమన్న… దేశ్‌ముఖ్‌ రామచెంద్రారెడ్డి… స్వయంగా రంగంలోకి దిగాడు. ఐలమ్మ, ఇతర పేదలు సాగు చేసుకునే భూమిలో కోతకొచ్చిన పంటను కోసుకురమ్మని తన మనుషులను పంపాడు. ఈ కుట్రలన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉన్న సంఘం నేతలు… ప్రజాదండును కూడగట్టారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతంలో పోరాటానికి నేతృత్వం వహించిన యోధుడు ంభీరెడ్డి నర్సింహ్మారెడ్డి, చకిలం యాదగిరిరావు వంటి నేతలు స్వయంగా పాల్గొని ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. దొర మనుషులను తన్ని తరిమారు. పంటను కాపాడి పేదల ఇళ్లకే చేర్చారు. మరో ఓటమితో కక్కలేని, మింగలేని పరిస్థితిలో పడ్డ విస్నుర్‌ దేశ్‌ముఖ్‌… నైజాం సాయంకోరి పోలీసుల్ని రంగంలోకి దింపారు. సంఘ నాయకుల్ని అడ్డుకున్న పోలీసులు కొంత ధాన్యాన్ని జప్తుచేయగా… అది తనశ్రమ ఫలితమేనని ధైర్యంగా ముందుకొచ్చింది ఐలమ్మ. ఈ ఘటనను సాకుగా చూపి సంఘనేతలపై దొమ్మీ సహా అనేక కేసులు పెట్టి.. సంఘం నేతలు భీంరెడ్డి, శ్రీనివాసరావు, ఐలమ్మ భర్త, కొడుకుతో సహా పలువురిని జైలుకు పంపి చిత్రహింసలకు గురిచేశారు. ఇలా…. పాలకుర్తి పోరాటకేంద్రంగా మారిన నేపథ్యంలో… అనేకసార్లు భూస్వాములు చేయించిన దాడుల్లో… కుమ్మరి లక్ష్మీనర్సు, కన్నెబోయిన సోవయ్య, కొత్త శ్రీహరి వంటి వారు అమరులు కాగా… జీవం సోమయ్య వంటి సంఘ సభ్యుల్ని గడ్డివాములో వేసి సజీవంగా కాల్చి చంపిన దుర్మార్గాలు చోటు చేసుకున్నాయి.
దాడులు, హత్యలు…. కేసులు….. దొరలెన్ని వేషాలేసిన…. జన చైతన్యం పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఎర్రజెండ అండ ఉండటంతో… దొరల కుట్రలకూ తలొగ్గలేదు. సంఘమై, రణరంగానికి ఎప్పుడైనా సిద్ధమే అని నిలిచిన పాలకుర్తి … పలు గ్రామాలకు వెలుగు దారిచూపిన కేంద్రమైంది. స్వాతంత్య్రానంతరమూ ఆ చైతన్యం కొనసాగింది. ఎన్నికల సమయంలోనూ సత్తా చాటిన సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో… రెండు దశాబ్దాలపాటు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది పాలకుర్తి. ప్రభుత్వంచే ఏడెనిమిదిసార్లు ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించబడటమే….అందుకు ఉదాహరణ. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారినా…. పోరు జెండానింపిన చైతన్యం ఆ గ్రామంలో నేటికి సజీవంగానే ఉంది.
చెమట మాది….
చేను మాది….
పంట మాది…
ఫలం మాది…
మా బతుకులపై మీ పెత్తనమేందీ!
అని దోపిడీ దొరలకు ఎదురు తిరిగి వీరవనితగా నిలిచిన మన ఐలమ్మ
మన పాలకుర్తి గడ్డ వీర తెలంగాణ పోరులో రాలని మోదుగుపూల కొమ్మ.వీరనారి ఐలమ్మ కీర్తి
(నేడు ఐలమ్మ 39వ వర్థంతి)
అనంగారి భాస్కర్‌
9010502255