నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ సంక్రాంతి వేడుకలను ప్రధానాచార్యులు చిలుక గట్టు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కోలాటాలు, రంగవల్లులు, గాలిపటాల ఆటలతో సందడి వాతావరణం నెలకొంది. పాఠశాల అధ్యక్షులు డాక్టర్ మనోహర్, సమితి కార్యదర్శి గర్శకుర్తి వెంకటేశ్వర్లు, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పిల్లలతో కలిసి ఏర్పాటు చేసిన సంక్రాంతి గ్రామీణ సాంప్రదాయ కళా రూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మైదానం మొత్తం రంగు రంగుల ముగ్గులతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటాలు, నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం బాలురు గాలిపటాలను ఎంతో ఉత్సాహంగా ఎగురవేశారు. ఆనందోత్సాహాలతో సంక్రాంతి వేడుకలను పాఠశాలలో జరువుకున్నారు. అనంతరం పాఠశాల అధ్యక్షులు డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ “సంక్రాంతి అంటేనే సంబరాల నిలయం అని, ఈ పండుగను పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని తెలిపారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా ఈ సం-క్రాంతీ పండుగ జరుపుకుంటామని, ఈ సంక్రాంతి నుండి రాత్రి సమయం తగ్గి, పగలు సమయం పెరుగుతుందని అంటే చీకట్లు తగ్గి వెలుతుర్లు పెరుగుతాయని అన్నారు. ప్రజల జీవితాల్లో కూడా విజయాలనే వెలుతురు రావాలని, దాని కోసం బద్దకం అనే చీకటిని పారద్రోలి చురుకుదనం అనే వెలుతురుని పొందాలని విద్యార్థులకు సూచించారు. ఈ వేడుకల్లో పాఠశాల తల్లిదండ్రులు, ఆచార్యులు మాతాజీలు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.