– విద్యార్ధులపై బలవంతంగా రుద్దేయత్నం
– కేంద్రానికి లొంగి ఎన్ఇపి-2020 అమలు
అమరావతి: సంస్కృతాన్ని విద్యార్ధులపై బలవంతంగా రుద్దడానికి రంగం సిద్ధమైంది. పాఠశాల విద్యలో మూడో భాషగా దీనిని అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ దాదాపు పూర్తిచేసింది. విద్యాశాఖ మంత్రి సంతకం చేయగానే మూడో భాషగా సంస్కృతం అమలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం(ఎన్ఇపి)-2020లో భాగంగా దీనిని అమలు చేస్తున్నారు. సంస్కృతాన్ని బలవంతంగా రుద్దాలని కేంద్రం చేసిన ప్రయత్నాన్ని పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. కేంద్రప్రభుత్వం షరతులకు లొంగిన రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలపై చెత్తపన్ను వంటి భారాలు మోపింది. దేశాన్ని కాషాయికరణలో భాగంగా సంస్కృతం అమలు,చరిత్ర తొలగింపు అంశాలు ఎన్ఇపి- 2020లో అంతర్లీనంగా ఉన్నాయి. ఎన్ఇపిలో భాగంగానే ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తరగతుల విలీన ప్రక్రియ అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల ప్రవేశాలు తగ్గి కొన్ని పాఠశాలలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఎన్ఇపిలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం సిబిఎస్ఇ సిలబస్ను ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే 1100 పాఠశాలలను సిబిఎస్ఇగా మార్చింది.
సిబిఎస్ఇ అమలు చేసే జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి(ఎన్సిఇఆర్టి) ఇటీవల కొంత సిలబస్ను తొలగించింది. డార్విన్ పరిణామా సిద్ధాంతం, మొగల్ చరిత్ర, ఆర్ఎస్ఎస్ నిషేధం, భగత్ సింగ్ చరిత్ర వంటి అంశాలను తొలగించింది. ఎన్సిఇఆర్టిలోని కొంత సిలబస్ను రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా మండలి (ఎస్సిఇఆర్టి) కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
9వ తరగతిలోని హిందీ సబ్జెక్టులో మొత్తం ఉత్తరభారత దేశ హిందీ మాండలికాలను ప్రవేశపెట్టి దక్షిణ భారతదేశ చరిత్రను హిందీ పాఠ్యాంశాల నుంచి ఎస్సిఇఆర్టి తొలగించింది. ఎన్ఇపిలో భాగంగా సంస్కృతాన్ని మొదటి భాషగా అమలు చేయాలని స్వరూపనంద స్వామి, చిన్నజీయర్ స్వామి వంటి హిందూ మఠాధిపతులు రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి చేశారని సమాచారం.