నవతెలంగాణ – కమ్మర్ పల్లి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారిగా రూ. 600 కూలి ఇవ్వాలని భారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సారా సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కొన సముందర్ గ్రామంలో ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సారా సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారిగా రూ.ఆరు వందలు ఇవ్వాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి రూ. 20వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్లకు నెలకు రూ.10వేల ఇవ్వాలని, ప్రతి కూలీకి గుర్తింపు కార్డు ఇవ్వడంతోపాటు ప్రతి మనిషికి 200 రోజులు పని కల్పించాలన్నారు. ప్రమాద బీమా ప్రభుత్వమే చెల్లించి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు.ఉపాధి హామీ పనికి వచ్చే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఇవ్వాలని కోరారు.2005లో ఇచ్చిన జాబ్ కార్డులు తప్ప ఇంతవరకు కొత్త జాబు కార్డులు ఇవ్వలేదని, ఒక్కొక్క కార్డు మీద ఆరుగురు ఏడుగురు ఉన్నారని ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2005-06 సంవత్సరంలో అనేక పోరాటాల ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో కోతలు పెడుతుందని విమర్శించారు. అనేకనేక అంశలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే పని ప్రదేశంలో కూలీలకు ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎండగడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూలీలంతా సంఘటితం అవ్వాలన్నారు.