– రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నారా లోకేశ్ వినతి
– యువగళం ప్రారంభిస్తామనగానే కేసు పెట్టారు
– రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటా : మీడియాతో నారా లోకేశ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ తో కలిసి లోకేష్ రాష్ట్రపతిని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా వినతి అందజేశారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ”2019 నుంచి ఏపీలో ప్రతిపక్షాలపై జరుగుతున్న అరాచకాలను రాష్ట్రపతికి వివరించాం. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన అంశాలను వివరించారు. 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్న చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపించారని వివరించాం. మా వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ రాష్ట్రపతికి అందజేశాం. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు” అని విమర్శించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇరికించారు
”యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని నిన్న ప్రకటించిన తర్వాత.. నన్ను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇరికించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ తో నాకేంటి సంబంధం. ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావట్లేదు. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ఏపీలో అరాచకాలపై వివరించాం. రోజుకో వదంతి, రోజుకో కేసులతో వేధిస్తున్నారు” అని విమర్శించారు.
తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
”తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తోంది. కేసులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. కేసు పెట్టాక అధారాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరుతున్నారు. కక్ష సాధింపు తప్ప ఒక్క కేసులోనూ చంద్రబాబు పాత్ర లేదు. నాకు, మా కుటుంబ సభ్యులకు ఒక్క పైసా రాలేదు. ఆయా కంపెనీల వద్ద ఒక కప్పు టీ కూడా తాగ లేదు” అని లోకేష్ స్పష్టం చేశారు.