తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సామాజిక బాధ్యతగా, విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎలా ఉండాలో సూచిస్తూ ప్రతిపాదనలను నాటి ప్రభుత్వానికి సమర్పించారు.వాటిని ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేవలం గురుకుల విద్యా వ్యవస్థను మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చింది. ఫలితంగా అప్పటికే కొనసాగుతున్న పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురైంది.ప్రభుత్వ అధికారిక లెక్కలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు మనకు కనబడుతున్నాయి.13,374 పాఠశాలల్లో 50 మంది లోపే పిల్లలు(పీఎస్, యూపీఎస్, ఐఎస్ అన్ని కలిపి) 5,821 బడుల్లో ఒకే టీచర్, 1213 పాఠశాలలు జీరో బడులు(పిల్లలు లేనివి) ఉన్నాయి.ప్రతి ఏటా ఇవి పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వ బడులకు ఆదరణ తగ్గుతుందనే విషయం మనకు అర్థమవుతున్నది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం గాడి తప్పడానికి అనేక కారణాలు. అందులో ప్రధానంగా అసౌకర్యాల లేమి, టీచర్ల కొరత, పర్యవేక్షణ లోపం,సత్ఫలితాలను ఇవ్వని పథకాల అమలు, బడులకు సరిపోయే బడ్జెట్ కేటాయించకపోవడం వంటివి ఉన్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో 30 93 368(50.90శాతం), ప్రయివేటులో 29 83705( 49.09 శాతం) ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం, విద్యార్థులు ఉన్న బడుల్లో టీచర్లు లేకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పదిమంది విద్యార్థులకి 8 మంది టీచర్లు ఉన్నారని, 130 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారని తరచూ వార్తాపత్రికల్లో వస్తున్న కథనాలు మనం చూస్తున్నాం.ప్రతి విద్యా ఏడాది ఆరంభంలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా అయా జిల్లాలలోని మండలాన్ని యూనిట్గా చేసుకొని ఉపాధ్యాయుల సర్దుబాటు చేసి తాత్కాలికంగా ఉపాధ్యాయుల కొరతను విద్యాశాఖ తీర్చుతుంది. ఉపాధ్యాయులు అందుబాటులో లేని బడుల్లో విద్యా వాలంటీర్లను నియమిస్తుంది.దీనికి శాశ్వతమైన పరిష్కారం ఉపాధ్యాయుల నియామకాలు చేస్తూ, హేతుబద్ధీకరణ చేయడమే. ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాల పెంపు కోసం ప్రతి ఏడాది వృత్యంతర శిక్షణలను ఇస్తూ, పర్యవేక్షణ అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం లేని వారిని నియమిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. జిల్లా, మండల స్థాయి పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం గల వారిని మాత్రమే నియమించాలి. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకోవాలంటే ఇది తప్పనిసరి.
రాష్ట్రగత బడ్జెట్లో విద్యారంగానికి 6.24 శాతం నిధులు కేటాయించగా ఈ సారి 21389 (7.75శాతం) కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి 1.51శాతం అధిక నిధులు విద్యారంగానికి కేటాయించారు. అయితే దేశంలోని టాప్ 20 రాష్ట్రాలలో తెలంగాణ కేటాయించింది తక్కువ. ఢిల్లీ 21.1శాతం, కర్నాటక 11శాతం, ఆంధ్రప్రదేశ్ (12.6శాతం), కేరళ(14శాతం), తమిళనాడు(14.1శాతం) రాష్ట్రాలు విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకి అత్యధిక నిధులు కేటాయించాయి. ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యారంగ కేటాయింపులు చాలా తక్కువ.
ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేస్తామని దానికి నిధులు కేటాయించడం సంతోషమే, కానీ ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ చేయాలంటే రాష్ట్రస్థాయిలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, మేధావులు, ఉన్నతాధికారులు, అనుభవజ్ఞులైన టీచర్ల తో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి వారి సలహా, సూచనలతో విద్యారంగాన్ని పట్టిష్టపరుస్తూ పాఠశాల విద్యను సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయింపు, మౌలిక సౌకర్యాల కల్పన, ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయ నియామకాలు, పర్యవేక్షణ, ప్రయివేటు బడుల్లో ప్రభుత్వ పుస్తకాలు వాడేలా చర్యలు తీసుకోవాలి, అలాగే ప్రయివేటులో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి.దశాబ్దకాలంగా గాడి తప్పిన పాఠశాల విద్యారంగాన్ని కొత్త ప్రభుత్వం చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– పాకాల శంకర్ గౌడ్, 9848377734.