4 నుంచి వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన

– 8 వరకు నిర్వహణ : టీజీపీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. అదేనెల ఎనిమిదో తేదీ వరకు ఆ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న టీజీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల మూడో తేదీన అభ్యర్థులకు వెబ్‌ఆప్షన్ల సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని తెలిపారు. ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 22న టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.