– ఆదివాసీ గ్రామాల్లో అధికారుల పర్యటన
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
ఏజెన్సీ కుగ్రామాల ఆదివాసీలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమతంగా ఉండేలా వైద్య సిబ్బంది నిరంతర తనిఖీ చేపట్టాలని ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ వివేక్ లు సూచించారు. కలెక్టర్ ఆదేశానుసారం జులై 22 నుండి ఆగస్టు 22 మధ్య ప్రసవానికి ఉన్న ప్రెగెంట్ తల్లులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గ్రామాల్లో అధికారులు పర్యటించారు. సోమవారం దంతలబొర ఎస్సీ కాలనీ గ్రామపంచాయతీ, సీతారాంపురం గుత్తి కోయ గ్రామాన్ని ఎంపీడీవో విజయ భాస్కర రెడ్డి, తహసీల్దార్ జి.వివేక్, డాక్టర్ జి.రాజులు సందర్శించారు. 5 కిలోమీటర్లు వాగులు దాటి, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. గర్భవతైన మహిళలు డాక్టర్లకు అందుబాటులో ఉండాలని, వర్షాకాలం దృష్ట్యా హఠాత్తుగా వాగులు వచ్చిన నేపథ్యంలో ఎదుర్కోవలసిన జాగ్రత్తలపై వివరించారు. ముగ్గురు (3) ప్రెగెంట్ మహిళలను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి ఒప్పించి, రప్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణయ్య, ఏఎన్ఎంలు విజయలక్ష్మి, జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ లు నహేమియా, శ్రీనివాస్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.