ధాన్యం కోనుగోలు చేయాలని రెండవ రోజు ధర్నా

నవతెలంగాణ-పెద్దవూర
ఐకేపి సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయక అన్నదాతలు విసిగిపోయి రెండవ రోజు కూడా ఆగ్రహించిన రైతులు మండలంలోని పోతునూరు స్టేజి హైదరాబాద్‌ నాగార్జున సాగర్‌ జాతీయ రహదారిపై రెండవరోజు శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. విక్రయం కోసం ధాన్యాన్ని ఆరుబయట కుప్పలుగా పోస్తేరోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ పోతునూరు, పులిచర్ల, కోమతికుంట తండాకు చెందిన 100 మందికిపైగా రైతులు రోడ్డు మీద ధాన్యం పోసి రైతులు పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఎటు రెండు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెల రోజుల నుంచి దాన్యం కొనుగోలు చేస్తారని ఎదురు చూస్తున్నా మాగోడు పట్టించుకొవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 44 డిగ్రీల ఎండలో కనీస వసతులులేక అల్లాడుతున్నామని తెలిపారు. వడగాడ్పులకు హరిగోసా అనుభవిస్తున్నా పట్టించుకునే వారిలేరని లారీలు రాక గొనె సంచులు లేక అవస్థలు పడుతున్నామని మొర పెట్టుకుంటున్నారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు తహశీల్దార్‌ సైదులు గౌడ్‌ చేరుకొని గోనె సంచుల కొరత, లారీల కొరత కారణంగా కొనుగోళ్లు చేపట్టలేదని రెండు రోజుల్లో దాన్యం కొనుగోలు చేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ధర్నాచేసిన వారిలో ఇంద్రకంటి వెంకటరెడ్డి, వీరబోయిన వెంకటయ్య, రమావత్‌ వాల, శోభన్‌ బాబు లచ్చిరాం, సన్నపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య, అనంతమల్లయ్య వెంకటయ్య, లక్ష్మయ్య, రామలింగయ్య, ఆంజనేయులు, ఎల్లయ్య ,నరినాయక్‌ రమేష్‌, శ్రీనయ్య, రాంబాబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.