– డీఎస్పీ రెహమాన్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం జిల్లా పరిధిలో జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు జరిగే డిఎస్సీ పరీక్షల నేపథ్యంలో పరీక్షా సెంటర్ అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ చట్టం-2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ తెలిపారు. జులై 18 తేది నుండి ప్రతి రోజు రెండు సెషన్లలో, ఉదయం 9గంటల నుండి 12 గంటలు మధ్యాహ్నం వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 5గంట వరకు జరగనున్న డిఎస్సి పరీక్ష సందర్బంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సెక్షన్ 163 అంక్షలు అమలులో ఉంటాయని, పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాలలో పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సంబంధిత నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.