బర్రెలక్కకు భద్రత కల్పించండి

బర్రెలక్కకు భద్రత కల్పించండి– హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొల్లాపూర్‌ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న శిరీష అలియాస్‌ బర్రెలక్కకు రక్షణ కల్పించాలని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సివి. భాస్కర్‌ రెడ్డి పోలీసులను ఆదేశించారు. తనకు సోషల్‌ మీడియాలో మంచి ఆదరణ లభించిందని, తన ప్రచారాన్ని కొంతమంది అడ్డుకుంటు న్నారని, తన సోదరుడిపై దాడి చేశారని, అయినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించ లేదంటూ బర్రెలక్క దాఖలు చేసిన పిటిషన్‌ ను శుక్రవారం హైకోర్టు విచారించింది. అభ్యర్థుల రక్షణ బాధ్యత పోలీసులదేనని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం పై నిఘా పెట్టడమే కాకుండా అభ్యర్థులకు రక్షణ కూడా కల్పించాలని స్పష్టం చేసింది. కార్లు తనిఖీలు చేసి విధులు నిర్వహించా మని చెబితే సరిపోదని అభిప్రాయపడింది. పోలీసులు రక్షణ కల్పించలేమని చెబితే తాము ఈసీ ద్వారా కేంద్ర బలగాలను రక్షణ గా ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ అభ్యర్థులకు రక్షణ కల్పిస్తున్నట్టు పోలీసుల తరఫున తెలియ జేశారు. పిటీషనర్‌ సోదరుడిపై దాడి ఘటన కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు. పిటీషన్‌ను మూసి వేస్తున్నట్టు ప్రకటించిన కోర్టు వెంటనే భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదే శించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో కనీస సౌకర్యాలు, భద్రతా చర్యలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కీతినీడి అఖిల్‌, శ్రీ గురు తేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. హైదరాబాద్‌ లోని జవహర్‌నగర్‌, రామ్‌నగర్‌, యూసుప ˜్‌గూడ, మాసబ్‌ట్యాంక్‌, రాజ్‌భవన్‌, సోమాజీగూడ, నాంపల్లి, అమీర్‌పేట్‌, బోరబండ, విజయానగర్‌, ప్రభాత్‌నగర్‌a లోని పాఠశాలలతోపాటు ఆలియా జూనియర్‌ కళాశాలలో 8,163 మంది విద్యార్థులు చదువుకుంటున్నారనీ. వీటి భవనాల్లో ఎక్కడా అగ్నిమాపక యంత్రాలు, బిల్డింగ్‌ పటిష్టత సర్టిఫికెట్‌ లేదని పిటీషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్న విధంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వసతులు కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ల ధర్మాసనం పై ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ చర్యలతో పాటు అగ్నిమాపకాలు, శానిటేషన్‌, శుద్ది చేసిన నీరు తదితరాలు కల్పించాలనీ, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ గైడ్‌లైన్స్‌(ఎన్‌డీఎంఏ) పేర్కొన్న పాఠశాల భద్రతా విధానం-2016 నిబంధనల మేరకు అమలు చేయాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై 4 వారాల్లో నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల, ఉన్నత విద్యా శాఖల ప్రధాన కార్యదర్శులు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌, ఇంటర్‌ బోర్డు, హౌం శాఖ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక సేవల డీజీ, కేంద్ర మహిళా వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.