
– ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నవతెలంగాణ – తాడ్వాయి
వేసవి కాలంలో నీటి సరఫరా లో అవాంతరాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ తో కలిసి త్రాగు నీటి సరఫరా తీరు పై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో నీటి ఇబ్బందులు తీవ్రం గా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడానికి ప్రతి గ్రామ పంచాయితి కి సూక్ష్మ ప్రణాళిక (మైక్రో ప్లాన్ ) తయారు చేయాలని, స్థానికం గా ఉన్న పరిస్థితుల పై అవగాహన ఏర్పరచు కొని, తగు పరిష్కార మార్గాలతో సిద్దం గా ఉండాలని, తక్కువ నీరు వచ్చే ప్రాంతాలను (టెయిల్ ఎండ్ ) గుర్తించాలని సూచించారు. వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో ఎన్ని చేతి పంపులు ఉన్నాయి? అందులో పనిచేసేవి ఎన్ని? రిపేరింగ్ దశలో ఎన్ని ఉన్నాయో వాటికి సంబందించిన ప్రోగ్రెస్ ఉండాలని, 2-3 రోజుల్లో మరమత్తులు చేయించి వినియోగం లోకి తీసుకురావాలని అన్నారు. చివరి పాయింట్ వరకు ఉన్న గృహాలకు నీరు అందించాలని ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టత ఉండాలని, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వాల్వుల పనితీరు పరిశీలించాలని, రాబోయే మూడు నెలల లో గ్రామాలలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోషణ పక్షం కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొని పౌష్టికాహారం ప్రాధాన్యత ను ప్రతి ఒక్కరూ గుర్తించి మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని అన్నారు. మనం రోజు తీసుకునే ఆహారంలో మంచి పోషక విలువలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళా సాధికారిత గురించి, అలాగే ఈ పక్షం రోజుల యొక్క కార్యక్రమాలు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం గురించి గర్భిణీలకు,బాలింత స్త్రీలకు వివరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్ డబ్ల్యూఎస్ సి ఈ శ్రీనివాసరావు, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ మల్లేశం, ఆర్ డబ్ల్యూఎస్, ఈ ఈ మాణిక్య రావు, డి ఈ ఈ యన్ పి డి సి ఎల్ నాగేశ్వర రావు, మండల స్పెషల్ ఆఫీసర్ అప్పయ్య, డి డబ్లుఓ స్వర్ణ లత లెనినా, సీడీపీఓ మల్లీశ్వరి, స్థానిక తహశీల్దార్ తోట రవీందర్, ఎంపీడీఓ సుమన వాణి, గ్రామ పంచాయితి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.