నాగలి కర్ర సర్రున
భూమిలోకి దిగగానే…
పుడమి కడుపులో వున్న
జీవధాతువులు మెల్లగా కదులుతాయి..!
కోలా ”హలం”గా రైతన్నలు
చాలు చాలును కలియ దున్నగా
మట్టి పెళ్ళలు చిట్లిపోయి
చీడపురుగులు చెదిరిపోయి ..
అదునుకు పదునెక్కుతుంది మేదిని.
రైతులు చల్లని మేలైన విత్తనాలను
నేలతల్లి కేలతో అందుకొని
ధరణి గర్భంలో దాచుకుంటుంది…!
ఆకుమడి ఆసుపత్రిలో
అన్నదాతలు మమతతో కప్పిన
నీటి పరజాలను కప్పుకొని
మొలకల శిశువులను ప్రసవిస్తుంది ..!
మడిలోని మొక్కలను తీసి
కషీవలులు క్షేత్రంలో నాట్లు వేస్తే
కనుచూపు దూరమంతా..
పచ్చల హరితమవుతుంది..!
ధరిత్రికి కుప్పలు కొద్దీ ఆహారమౌతుంది..!!!!
– జి.సూర్యనారాయణ, 6281725659.