– సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్
నవతెలంగాణ-ఖానాపూర్
సెప్టెంబర్17 ముమ్మాటికి విద్రోహ దినమేనని ఇది చరిత్రను వక్రీకరించడమే పాలకుల ఎత్తుగడని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందని, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000 గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పంచడం జరిగిందన్నారు. ఈ పోరాటంలో 4,000 మంది అమరవీరులయ్యారని, తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం పోరాడాడని అన్నారు. చరిత్రను మరచిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అమరవీరుల త్యాగాలను, పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ, విలీనమని విమోచనమని అన్నారు. పోరాడిన పోరాటాలను పాలకులు వక్రీకరిస్తున్నారని అన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సెప్టెంబర్ 17 పోరాటాన్ని విద్రోహ దినంగా పాటించాలని కోరుతూ విద్రోహ దినంగా పాటించామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, ఆకుల సత్తన్న పాల్గొన్నారు.
ఆదిలాబాద్టౌన్ : సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమేనని ఇది చరిత్రను వక్రీకరించడమే పాలకుల ఎత్తుగడని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట నారాయణ అన్నారు. మంగళవారం కుమురంభీం భవనంలో సెప్టెంబర్17 విద్రోహ దినం కార్యక్రమంలో బి.వెంకటనారాయణ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందన్నారు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3వేల గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పంచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో 4,000 మంది అమరవీరులైనరని పేర్కొన్నారు. తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య భూమి కోసం, భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం పోరాడాడని అన్నారు. చరిత్రను మరచిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అమరవీరుల త్యాగాలను, పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ, విలీనమని, విమోచనమని నేడు తన పోరాడిన పోరాటాలను పాలకులు వక్రీకరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు వామన్, గంగమ్మ, మడావి గణేష్, శ్యామ్, మనోజ్, తౌపీక్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ఆధ్వర్యంలో…
భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం విరోచితంగా పోరాడి తమ అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకున్న రోజు సెప్టెంబర్ 17 విలీనం కాదని, విమోచన దినం కాదని ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినమేనని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కుమురంభీం భవన్, మాస్లైన్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్తూపానికి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జగన్సింగ్ మాట్లాడుతూ భూస్వామ్య, రాచరిక బానిసత్వంపై తిరగబడి, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం సాగిందే విరోచీత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కావడానికి తొలి అమరత్వం పొందిన వాడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుమ్ర అశోక్, సిడం సాయికుమార్, గారే రాములు, రాము, కొడప సురేష్, మడావి రేణుక, వనిత, భాస్కర్ పాల్గొన్నారు.