ముంబయి: ముంబయిలోని రెండంతస్తుల షాప్ కమ్ రెసిడెన్షియల్ స్ట్రక్చర్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడేండ్ల బాలికతో సహా ఏడుగురు మృతి చెందినట్టు అగ్నిమాపక అధికారి తెలిపారు. చెంబూర్ ప్రాంతంలోని సిద్ధార్థ్ కాలనీలో తెల్లవారుజామున 5.20 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక దుకాణాన్ని కలిగి ఉండగా, పైఅంతస్తును నివాసంగా ఉపయోగించినట్టు అధికారి తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లోని షాపులోని ఎలక్ట్రిక్ వైరింగ్, ఇన్స్టాలేషన్లకు మంటలు చెలరేగాయి. ఇవి పై అంతస్తుకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. బాధితులను ప్రభుత్వ నిర్వహణలోని రాజవాడి ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు వివరించారు. క్షతగాత్రులకు వైద్యసేవలందించాలని ఆదేశించారు. బంధువుల్ని కోల్పోయిన కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.