– ధ్రువీకరించిన మరోసాక్షి
– తప్పు జరగడం నేను చూశా : అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్ సింగ్
– బ్రిజ్ భూషణ్ ఇంటికి రెజ్లర్ సంగీతా పోగట్ను తీసుకెళ్లిన ఢిల్లీ పోలీసులు
– రాజీ వార్తలను ఖండించిన రెజ్లర్లు
– వారు విద్వేష ప్రసంగాలు చేయలేదు : ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ : రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఆగడాలను ఒక్కొక్కరు బయట పెడుతున్నారు. మొన్న కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన రెజ్లర్ అనిత కొన్ని సాక్ష్యాలను బయటపెట్టారు. తాజాగా అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్ సింగ్ మరికొన్ని అంశాలను బయటపెట్టారు. 2007 నుంచి అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీగా ఉన్న జగ్బీర్ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రెజ్లర్ ఆరోపణలను ధ్రువీకరించారు. అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ లక్నోలో గెలిచిన తరువాత ఫోటో తీసుకున్నప్పుడు అతని అనుచిత ప్రవర్తనను తాను చూశానని అన్నారు. ”నేను ఆయనను (బ్రిజ్ భూషణ్) ఆమె పక్కన నిలబడి ఉండటం చూశాను. ఆమె తనను తాను విడిపించుకుని, దూరంగా నెట్టివేసి, గొణుగుతూ దూరంగా కదిలింది. ఆమె ప్రెసిడెంట్ పక్కన నిలబడి ఉంది. కానీ తర్వాత ముందుకు వచ్చింది. ఈ మహిళా రెజ్లర్ ఎలా స్పందిస్తుందో నేను చూశాను. ఆమె అసౌకర్యంగా ఉంది. ఆమెకు ఏదో తప్పు జరిగింది. ఆయన ఆ పని చేయడం నేను చూడలేదు. ఇక్కడకు రండి, వచ్చి ఇక్కడ నిలబడండి అం టూ మల్లయోధులను తాకుతూ ఉండేవాడు. ఆమె (ఫిర్యాదు దారు) ప్రవర్తనను బట్టి, ఆ రోజు (ఫోటో సెషన్ సమ యంలో) ఏదో తప్పు జరిగిందని స్పష్టమైంది’ అని జగ్బీర్ అన్నారు. ఫోటో కోసం ముందు వరుసలోకి వెళ్లడానికి ముందు సింగ్ ఆమెను బలవంతంగా భుజం పట్టుకున్నాడు. ‘నేను ఎత్తైన రెజ్లర్లలో ఒకరిని కాబట్టి, నేను చివరి వరుసలో నిలబడవలసి ఉంది. నేను చివరి వరుసలో నిలబడి ఇతర మల్లయోధులు తమ స్థానాలను తీసుకుంటారని ఎదురు చూస్తుండగా, నిందితుడు వచ్చి నా పక్కన నిలబడ్డారు. నాకు షాక్. ఆశ్చర్యానికి గురయ్యాను. అకస్మాత్తుగా నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నన్ను రక్షించుకోవడానికి నేను వెంటనే ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించాను. అయితే, నేను దూరంగా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, నిందితుడు నన్ను బలవంతంగా నా భుజం పట్టుకున్నారు. ఎలాగోలా నిందితుల బారి నుంచి బయటపడ్డాను” అని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
బ్రిజ్ భూషణ్ ఇంటికి రెజ్లర్ సంగీతా పోగట్ను తీసికెళ్లిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ పోలీసులు రెజ్లర్ సంగీతా ఫోగట్ను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. సంగీతా ఫోగట్తో పాటు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని సమాచారం. అక్కడ లైంగిక వేధింపులకు దారితీసిన సీన్ రీక్రియేట్ చేసినట్టు తెలుస్తున్నది. మహిళా రెజ్లర్ బ్రిజ్ భూషణ్ ఇంటికి వెళ్లలేదని, విచారణ కోసం పోలీసులు తీసుకెళ్లారని రెజ్లర్లు, ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా సిట్ 180 మందికి పైగా ప్రశ్నించినట్టు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ నివాసంలో సంగీతా ఫోగట్ కనిపించిన తరువాత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్తో లైంగిక వేధింపుల సమస్యను రెజ్లర్లు పరిష్కరించుకుంటున్నారనే వార్తలను రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఖండించారు. బ్రిజ్ భూషణ్ తన అధికారాన్ని ఉపయోగించి కథనాన్ని మార్చేస్తున్నాడని అన్నారు. ”మహిళా రెజ్లర్లు పోలీసు విచారణ కోసం క్రైమ్ సైట్కు వెళ్లారని, అయితే వారు రాజీకి వెళ్లారని మీడియాలో ప్రచారం జరిగింది” అని వినేష్ విమర్శించారు. ”తప్పుడు కథనాలను నడుపుతూ మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు మమ్మల్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని బజరంగ్ పునియా అన్నారు. బ్రిజ్ భూషణ్ ఇంటికి మహిళా రెజ్లర్లు వెళ్లడంపై తప్పుడు వార్తలు వస్తున్నాయని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ”దయచేసి పుకార్లను పట్టించుకోవద్దు. ఢిల్లీ పోలీసులు ఒక మహిళా రెజ్లర్ను విచారణ కోసం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తీసుకెళ్లారు” అని డీసీపీ న్యూఢిల్లీ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది. అదే సమయంలో తన నివాసానికి ఎవరూ రాలేదని బ్రిజ్ భూషణ్ తెలిపారు.
రెజ్లర్లు విద్వేష ప్రసంగాలు చేయలేదు : ఢిల్లీ పోలీసులు
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు విద్వేష ప్రసంగాలు చేయలేదని, విచారించదగిన నేరానికి పాల్పడలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్ చర్చల నేపథ్యంలో జూన్ 15 వరకు రెజ్లర్లు తమ నిరసనను నిలిపివేసిన సంగతి తెలిసిందే.