మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేండ్ల నుంచి పెంచకుండా, నిధులు పెంచకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. గత ఎనిమిది నెలలుగా వేతనాలివ్వకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని తెలిపారు. కార్మికులు ఆందోళన చేస్తుంటే చాలా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం నిలిచిపోయిందని పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం అందించకుండా నాసిరకం భోజనం పెడుతున్న అక్షయపాత్ర, ఇస్కాన్‌ సంస్థల కాంట్రాక్టును రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు చెల్లించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.