షాద్‌నగర్‌ మున్సిపాలిటీని అగ్రగామిగా నిలబెడుతాం

– మున్సిపల్‌ కమిషనర్‌ సిహెచ్‌ వెంకన్న
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
స్వచ్ఛ సర్వేక్షన్‌లో షాద్‌నగర్‌ మున్సిపాలిటీని అగ్రగామిగా నిలబెడుతామని మున్సిపల్‌ కమిషనర్‌ సిహెచ్‌ వెంకన్న అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలో రోడ్డుపై పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వెంకన్న మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారని, ప్రజలు కూడా చెత్తాచెదారం బయట వేయకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకుండా చూడాలని కోరారు. పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ ఆదేశాల మేరకు పట్టణాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా రోడ్లపై చెత్తాచెదారం వేస్తే వారికి నోటీసులు ఇవ్వడం లేదా జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, మున్సిపల్‌ కౌన్సిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.