డివోషనల్‌ థ్రిల్లర్‌.. షణ్ముఖ

డివోషనల్‌ థ్రిల్లర్‌.. షణ్ముఖవైవిధ్యమైన చిత్రాలను, విభిన్నమైన కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’. పవర్‌ఫుల్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌ కథానాయకుడు. అవికాగోర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. ‘శాసనసభ’ అనే పాన్‌ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్‌ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్‌ సమర్పణలో తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్‌ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ,’ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. విజువల్‌ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్‌లో చివరి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్‌ ఈ చిత్రానికి స్టనింగ్‌ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణాంతర పనులు మొదలు కానున్నాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్‌ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది తప్పకుండా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది’ అని అన్నారు.
హీరో ఆదిసాయికుమార్‌ మాట్లాడుతూ, ‘నా కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో రకాల సినిమాలు చేశాను. అవన్ని ఓ ఎత్తయితే ఈ సినిమా మరో ఎత్తు. ఓ సరికొత్త పాయింట్‌తో మంచి కంటెంట్‌తో రూపొందుతున్న ఈ తరహా చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో బాగా గుర్తుండిపోయే సినిమాగా ఇది విశేష ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. మా దర్శకుడు అనుకున్న కథని తెరకెక్కించేందుకు బాగా కష్టపడ్డారు. ఆయన కష్టం కచ్చితంగా స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఇక మా నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను ఓ విజువల్‌ వండర్‌లా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు’ అని తెలిపారు.