బౌలింగ్‌లో చెలరేగిన శశికాంత్‌, నితీష్‌

బౌలింగ్‌లో చెలరేగిన శశికాంత్‌, నితీష్‌– మధ్యప్రదేశ్‌ 234/9
– రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్స్‌
ఇండోర్‌: రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్ర బౌలర్లు శశికాంత్‌, నితీశ్‌ కుమార్‌ చెలరేగారు. దీంతో టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్‌ను తొలిరోజే ఆంధ్ర బౌలర్లు కట్టడి చేశారు. శశికాంత్‌ నాలుగు, నితీశ్‌ కుమార్‌ మూడు వికెట్లతో సత్తా చాటడడంతో మధ్యప్రదేశ్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 9వికెట్ల నష్టపోయి 234పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌ ఓపెనర్లు యశ్‌ దూబే(64), హిమాన్షు(49) తొలి వికెట్‌కు 123 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు ఔటయ్యాక ఆంధ్ర బౌలర్లు చెలరేగారు. దీంతో మధ్యప్రదేశ్‌ జట్టు ఓ దశలో 159పరుగులకే 7వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సరళ్‌ జైన్‌(41నాటౌట్‌), కార్తికేయ(29) ఆదుకున్నారు. చివరి సెషన్‌లో మరో రెండు వికెట్లను ఆంధ్ర బౌలర్లు నేలకూల్చడంతో మధ్యప్రదేశ్‌ భారీస్కోర్‌ చేయకుండా అడ్డుకున్నారు. ఇతర క్వార్టర్‌ఫైనల్లో కర్ణాటకపై విదర్భ జట్టు 3వికెట్ల నష్టానికి 261పరుగులు చేయగా.. తమిళనాడుతో జరుగుతు మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183పరుగులకే ఆలౌటైంది. మరో క్వార్టర్‌ఫైనల్లో బరోడాపై ముంబయి జట్టు 5వికెట్ల నష్టానికి 248పరుగులు చేసింది.