పీసీబీ నిర్ణయాన్ని తప్పుబట్టిన షోయబ్‌ అక్తర్‌

PCB decision Wrong Shoaib Akhtar– ఛాంపియన్స్‌ ట్రోఫీ
ఇస్లామాబాద్‌ : భవిష్యత్‌లో భారత్‌లో నిర్వహించే ఐసిసి టోర్నీలకు వెళ్లకూడదన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) నిర్ణయాన్ని ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వ్యతిరేకించారు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా నిర్వహించే ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆ దేశంలో పర్యటించేది లేదని ఇప్పటికే బీసీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీని హైబ్రిడ్‌ పద్ధతిలో నిర్వహించడానికి ససేమిరా అంటూ వచ్చిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఎట్టకేలకు దిగొచ్చింది. పాక్‌లో పర్యటించడానికి భారత్‌ నిరాకరిస్తున్న నేపథ్యంలో ఐసీసీ చెప్పినట్టే ఆ జట్టు మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్‌ పద్ధతికి అంగీకరిస్తామని పీసీబీ తాజాగా పేర్కొంది. కానీ ఈ విషయంలో పాక్‌ బోర్డు ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసిసి టోర్నీల కోసం భారత్‌కు వెళ్లకూడదని నిర్ణయిస్తే.. ఆ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలని పేర్కొంది. అయితే.. ఈ నిర్ణయాన్ని ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వ్యతిరేకించాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించే ఈ టోర్నీ రెవెన్యూలో అధిక వాటాను పీసీబీ డిమాండ్‌ చేయడాన్ని షోయబ్‌ అక్తర్‌ సమర్థించాడు. ఇది సరైన నిర్ణయమేనని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో ఐసిసి ఈవెంట్‌ల కోసం భారత్‌కు వెళ్లకూడదన్న వైఖరిపై మాత్రం అభ్యంతరం వ్యక్తంచేశాడు. వారిని సొంతగడ్డపైనే ఓడించేలా పాక్‌ జట్టును నిర్మించాలని కోరాడు.
హైబ్రిడ్‌ మోడల్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీని
ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత తొలగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ హైబ్రిడ్‌ మోడల్‌లో జరగనున్నట్టు సమాచారం. అయితే మొన్నటివరకు ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగడం అనుమానంగా సాగింది. పాకిస్థాన్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ టీమిండియాను పంపించబోమని బీసీసీఐ స్పష్టం చేయడం, మరోవైపు హైబ్రిడ్‌ మోడల్‌లోనే టోర్నీ నిర్వహిస్తామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పట్టుబట్టడంతో.. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. ఇక హైబ్రిడ్‌ మోడల్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీని నిర్వహించడం దాదాపు ఖాయమైంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు దుబారు వేదిక కానున్నట్లు సమాచారం. భారత్‌ సెమీస్‌, ఫైనల్‌ వరకు చేరుకుంటే. ఆ మ్యాచ్‌లను కూడా అక్కడే నిర్వహిస్తారు.