– కిదాంబి శ్రీకాంత్ పరాజయం
– మలేషియా మాస్టర్స్
కౌలాలంపూర్ : భారత స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ నం.2 పి.వి సింధు ఫామ్లోకి దూసుకొచ్చింది. చైనా షట్లర్ జాంగ్ యి మాన్ను చిత్తు చేసిన తెలుగు తేజం మలేషియా మాస్టర్స్ టోర్నీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో 21-16, 13-21, 22-20తో పి.వి సింధు విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో జపాన్ స్టార్ షట్లర్ కెంటా నిషిమోటపై 25-23, 18-21, 21-18తో హెచ్.ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. మూడు గేముల మ్యాచుల్లో గెలుపొందిన సింధు, ప్రణరులు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లో విఫలమయ్యాడు. 21-16, 16-21, 11-21తో ఇండోనేషియా షట్లర్ క్రిస్టియన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నేడు సెమీస్లో ఇండోనేషియా షట్లర్, ఏడో సీడ్ గ్రెగోరియ మారిస్క టన్జంగ్తో సింధు తలపడనుండగా.. క్వాలిఫయర్ క్రిస్టియన్తో ప్రణయ్ పోటీపడనున్నాడు.
సింధు అదిరెన్ : మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు దుమ్మురేపింది. చైనా షట్లర్ జాంగ్యి మాన్ను చిత్తు చేసింది. 74 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సింధు 2-1తో గెలుపొందింది. తొలి గేమ్లో సింధు తొలుత వెనుకంజ వేసింది. జాంగ్ యి మాన్ ఆరంభంలో ముందంజలో వేసినా.. 10-10 వద్ద తొలిసారి స్కోరు సమం చేసిన సింధు 11-10తో విరామ సమయానికి ఆధిక్యం దక్కించుకుంది. ద్వితీయార్థంలో ఎక్కడా వెనక్కి తగ్గని సింధు వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 21-16తో అలవోకగా తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లో జాంగ్ యి మాన్ పుంజుకుంది. 11-4తో విరామ సమయానికి భారీ ఆధిక్యంలో నిలిచిన జాంగ్ యి మాన్.. 21-13తో రెండో గేమ్ను గెల్చుకుంది. మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో గేమ్కు తీసుకెళ్లింది. ఇక టైబ్రేకర్కు దారితీసిన మూడో గేమ్లో సింధు పైచేయి సాధించింది. 11-8తో ఆధిక్యంలో నిలిచిన సింధు..13-15తో లయ కోల్పోయింది. 20-17తో సింధు మ్యాచ్ పాయింట్ వద్ద నిలువగా.. జాంగ్ యి మాన్ గొప్ప ప్రతిఘటన చూపించింది. వరుసగా మూడు సార్లు మ్యాచ్ పాయింట్ కాచుకుని 20-20తో స్కోరు సమం చేసింది. చివర్లో వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన సింధు 22-20తో మూడో గేమ్ను, సెమీఫైనల్స్ బెర్త్ను సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్లో ప్రణరు మారథాన్ పోరాటం చేశాడు. జపాన్ షట్లర్ కెంటా నిషిమోటను మూడు గేముల్లో జయించాడు. 91 నిమిషాల సాగిన క్వార్టర్ఫైనల్లో భారత షట్లర్ 2-1తో విజయం సాధించాడు. ఆద్యంతం ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠగా సాగిన తొలి గేమ్ను సూపర్ టైబ్రేకర్లో ప్రణయ్ 25-23తో సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ 21-18తో నిషిమోట నెగ్గగా.. నిర్ణయాత్మక మూడో గేమ్ను ప్రణయ్ 21-13తో అలవోకగా గెలుపొందాడు. క్వార్టర్స్లో మెరుపు విజయం సాధించిన హెచ్.ఎస్ ప్రణయ్ నేడు సెమీస్లో ఇండోనేషియా షట్లర్ క్రిస్టియన్ (క్వాలిఫయర్)తో ఢకొీట్టనున్నాడు. మరో క్వార్టర్స్ పోరులో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్పై 16-21, 21-16, 21-11తో క్రిస్టియన్ విజయం సాధించాడు.