సింగరేణి విశ్రాంత ఉద్యోగులను సీనియర్‌ సిటీజన్‌లుగా గుర్తించాలి

– సింగరేణి రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకుల డిమాండ్‌
నవతెలంగాణ-జైపూర్‌
సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి విశ్రాంత ఉధ్యోగులను సీనియర్‌ సిటీజన్లుగా గుర్తించి ప్రభుత్వ పరంగా ప్రాధాన్యత కల్పించాలని సింగరేణి రిటైర్డ్‌ ఎం ప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైన నాయకులు విశ్రాంత ఉధ్యోగులకు తెల్ల రేషన్‌ కార్డులు, ఆసరా పింఛన్లు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సంఘాల నాయకులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. అతి తక్కువగా చెల్లిస్తున్న కోల్‌మైన్స్‌ పెన్షన్‌తో బ్రతకడం కష్టంగా మారిన తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి త్వరలో పోస్టు కార్డుల ఉధ్యమం ద్వార తెలియజేస్తామని అన్నారు. అదేవిధంగా సింగరేణి అధికారులు, కోల్‌మైన్స్‌ పెన్షన్‌ ఫండ్‌ అధికారులు, విశ్రాంత ఉద్యోగులకు రివైజ్డ్‌ పెన్షన్‌ పేమేంట్‌ ఆర్డర్లు వ్యక్తిగత చిరునామాలకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఈ సంధర్భంగా కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్‌ రావు, ప్రధాన కార్యదర్శి బూపెల్లి బానయ్య, ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్‌ వేణుమాధవ్‌ పాల్గొన్నారు.