– ఎస్ఎల్బీసీ పూర్తికి 2200 కోట్ల రూపాయలను విడుదల
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
30 నెలల్లో ఎస్ఎల్బిసి సొరంగం పనులను పూర్తి చేసి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, గుండ్లపల్లి గ్రామం వద్ద డి-37 కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయడం జరిగిందని, ఇందులో భాగంగా -డీ37 ద్వారా సుమారు 50000 ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రి తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడే ఈ కాలువలను తవ్వడం జరిగిందని, అప్పటినుండి గత సీజన్లో తప్ప నిరంతరం సాగునీరు ఇచ్చామని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగనీటిని వదలడం వలన రైతుల ముఖాలలో సంతోషం కనబడుతున్నదని తెలిపారు. డి-37 తో పాటు డి-41, 42 కాలువల ద్వారా సైతం సాగునీరు ఇస్తున్నామని, అయితే గత సంవత్సరం సాగునీరు విడుదల చేయని కారణంగా కాలువలలో పూడికతో పాటు, కంపచెట్లు పెరిగిపోయాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తాను సొంతంగా తన నిధులతో 10 మిషన్లను ఏర్పాటు చేసి అన్ని కాలువలలో పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామని పేర్కొనరు.
నాలుగైదు రోజుల్లో ఏఎంఆర్పి కింద ఉన్న అన్ని కాలువల ద్వారా చెరువులకు నీరు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఏర్పడతాయని ఊహించి నల్గొండ ప్రాంతం కరువుకు గురికాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అందించే ఏర్పాటును అప్పుడే చేపట్టడం జరిగిందని,అయితే గత ప్రభుత్వాలు ఎస్ఎల్బీసీకి సరైన విధంగా నిధులు కేటాయించకపోవడం వల్ల అది పెండింగ్లో ఉండిపోయిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పూర్తికి 2200 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, యుద్ధ ప్రాతిపదికన 30 నెలల్లో ఎస్ ఎల్ బి సి సొరంగం పనులు పూర్తి చేస్తామని, దీని ద్వారా బ్రాహ్మణ వెళ్లెముల కు సాగు నీరు నీరు అందుతుందని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తవుతే నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు. దీంతోపాటు, ధర్మారెడ్డి సాగర్, శివన్న గూడెం తదితర ఎత్తిపోతలన్ని పూర్తయితే మరో మూడు లక్షలు ఎకరాలకు సాగునీరు వస్తుందని, జిల్లాలో ఒక్క ఎకరం ఖాళీ లేకుండా సాగునీరిచ్చి ప్రజల రుణం తీర్చుకుంటామని ఆయన తెలిపారు. తాము రైతుల సంక్షేమంతో పాటు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ఉద్దేశమని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమంతో పాటు, అన్ని గ్రామాలు, పట్టణాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో భాగంగా డబుల్ రోడ్డులను నిర్మిస్తున్నామని, నల్గొండ నుండి గుండ్లపల్లి మీదుగా నిర్మించే డబుల్ రోడ్డుకు రైతులందరూ సహకరించాలని ఆయన కోరారు. ఎస్ఎల్బిసి సోరంగం మిషన్ విడిభాగాల విషయమై అమెరికా కంపెనీతో మాట్లాడి యంత్ర పరికరం తెప్పించనున్నట్లు తెలిపారు.విదేశీ సహకారంతో నల్గొండ జిల్లాలో పరిశ్రమలుఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, ఎస్ ఈ శ్రీనివాసరెడ్డి,నల్గొండ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి,అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.