అమేథీలో నామినేషన్‌ దాఖలు చేసిన స్మృతి ఇరానీ

లక్నో : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌ అమేథీ లోక్‌సభ స్థానానికి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ వేసేముందు ఆమె ఆయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అమేథీలో మే 20వ తేదీన ఐదో దశలో ఓటింగ్‌ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారం నాడు (ఏప్రిల్‌ 26) ప్రారంభమైంది. మే 3 నామినేషన్‌లకు చివరి తేది. ఇదిలా ఉండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ ఇప్పటివరకు అమేథీలో పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించలేదు. అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉండేది. కానీ 2019లో అమేథీ స్థానంలో పోటీ చేసిన రాహుల్‌ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. మళ్లీ ఇక్కడి నుంచి రాహుల్‌నే బరిలో నిలిపేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ రాయబరేలి స్థానానికి కూడా ఇప్పటివరకూ అభ్యర్థిని ప్రకటించలేదు.
మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్‌
ఇంఫాల్‌ : మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్‌ జరగనుంది. ఔటర్‌ మణిపూర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గంలోని ఆరు పోలింగ్‌ స్టేషన్లలో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రెండో విడతలో భాగంగా ఈ నెల 26న జరిగిన పోలింగ్‌ సందర్భంగా ఈ ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉఖ్రుల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నాలుగు పోలింగ్‌ స్టేషన్‌లు, ఉఖ్రుల్‌లోని చింగై అసెంబ్లీ సీటు, సేనాపతిలోని కరోంగ్‌లలో ఒక్కో స్థానంలో ఏప్రిల్‌ 30న రీపోలింగ్‌ నిర్వహిస్తా మని, రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ కుమార్‌ ఝా తెలిపారు. కాగా మొదటి విడత ఎన్నికల్లో ఇన్నర్‌ మణిపూర్‌ లోకసభ పోలింగ్‌లో కూడా రీపోలింగ్‌ జరిగింది. ఎన్నికల సంద ర్భంగా కాల్పులు, పోలింగ్‌ కేంద్రాలపై దాడులు జరగడంతో 11 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 22న రీపోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.