– అర్ధరాత్రి పరుగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కు విద్యార్థులు
– విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నైట్ స్టే అధికారి, వాచ్ మెన్ లకు మెమోలు
నవతెలంగాణ – చేర్యాల
పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చిన సంఘటన చేర్యాల మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దెబ్బల దాటికి తట్టుకోలేక భయంతో వీధుల వెంబడి పరురుగులు తీస్తూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్ లో పదవ తరగతి విద్యార్థులు వారి తరగతి గదిలో చదువుకుంటున్న సమయంలో అదే హాస్టల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొంతమంది విధ్యార్థులు అల్లరి చేస్తున్నారనే నెపంతో అకారణంగా బెల్టులతో, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టడంతో, దెబ్బలను తట్టుకోలేక ప్రహరీ గోడ దూకి పరుగులు తీస్తూ తల దాచుకొనేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.
బాధ్యులపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం: ప్రిన్సిపాల్ బి.అశోక్ బాబు
అర్ధరాత్రి జరిగిన ఘటన పై ప్రిన్సిపాల్ అశోక్ బాబు మాట్లాడుతూ.. పదవతరగతి విద్యార్థుల పైన దాడి చేసిన ఘటన వాస్తవమేనని, ఘర్షణలో పదవ తరగతి విద్యార్థులు కొంతమంది గాయపడ్డారని తెలిపారు. దాడి చేసిన ఇంటర్ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని, వారిని కళాశాల నుండి బయటికి లేదా వేరే కళాశాలకు పంపించడానికి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తున్నట్టు తెలిపారు. విధుల్లో ఉండి నిర్లక్ష్యం వహించిన నైట్ స్టే అధికారి పాము కృష్ణమూర్తి, వాచ్ మెన్ లక్ష్మణ్ కు మెమో జారి చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలను సందర్శించిన ఆర్సిఓ
గురువారం రాత్రి జరిగిన సంఘటనపై స్పందించిన రివిజినల్ కోఆర్డినేటర్ నిర్మల పాఠశాల, హాస్టల్ ను సందర్శించి ఇరువురు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం నిర్మల మాట్లాడుతూ.. జరిగిన ఘటన పైన విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.