పాత జిల్లా సర్వీస్‌ మేరకే ఉద్యోగుల సమస్యల పరిష్కారం

– క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో మంత్రి దామోదర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పాత జిల్లాల్లో సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని 317 జీవో పరిధిలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని 317 జీవో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగుల సర్వీస్‌, పదోన్నతి సమస్యలను పరిష్కారం కానున్నాయి. సబ్‌ కమిటీ చైర్మెన్‌, మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగింది. వివిధ శాఖలకు చెందిన పూర్తి సమాచారాన్ని వెంటనే సబ్‌ కమిటీకి సమర్పించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తొమ్మిది ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. కమిటీ సభ్యులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.