త్వరలో రైతు, విద్యా కమిషన్లు కౌలు రైతుల

– సమస్యలపై అఖిల పక్షం
– రైతు భరోసా లబ్దిదారులపై విసృత చర్చ జరగాలి
– పంటల బీమాను అమలు చేస్తాం
– నియోజకవర్గాల్లో సంక్షేమ గురుకుల ప్రాంగణాలు ఏర్పాటు : పౌర సమాజ ప్రతినిధులతో సీఎం రేవంత్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”త్వరలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్‌ కమిషన్‌ నిర్ణయిస్తుంది. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్‌ తగిన సలహాలు సూచనలు అందిస్తుంది.” అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎమ్మెల్సీ మహేష్‌గౌడ్‌తో కలిసి యోగేంద్ర యాదవ్‌, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్‌, విశ్వేశ్వర్‌ రావు, రమ మేల్కొటే, రియాజ్‌, పురుషోత్తం తదితర పౌర సమాజ ప్రతినిధులతో సీఎం ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే తమ ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను తెరిచామనీ, ప్రజా భవన్‌ను ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలనీ, ఆర్ధిక, విద్యుత్‌, సాగునీటి రంగాల స్థితిగతులపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూర్చేలా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అందరి సూచనలు, సలహాల ఆధారంగా కౌలు రైతుల రక్షణ చట్టంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పంటలకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా సాయాన్ని ఎవరికివ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని సీఎం చెప్పారు. నిస్సహాయులకు, నిజమైన లబ్దిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని చెప్పారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందనీ, అన్ని పంటలు విస్తరించేలా సరికొత్త విధానాలను అనుసరించాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాలయాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని వారికి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను వేర్వేరు చోట్ల కాకుండా, ఒకే ఇంటిగ్రేటేడ్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. పైలట్‌ ప్రాజెక్టుగా కొడంగల్‌లో అలాంటి క్యాంపస్‌ నెలకొల్పుతామని అన్నారు. దశల వారీగా అన్ని నియోజకవర్గాలకు ఆయా క్యాంపస్‌లను విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల విద్యా సంస్థల్లో కుల, మత వివక్ష తొలిగిపోవడంతో పాటు, విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలు, పోటీ తత్వం పెరుగుతదని అన్నారు. తద్వారా గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందనీ, ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేసినట్టు గుర్తు చేశారు. గ్రూప్‌ 1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదలయ్యాయని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయడమే తమ ప్రభత్వ లక్ష్యమనీ, అందు కోసం అందరి సలహాలు, సూచనలతో ముందుకు పోతామని చెప్పారు.