– విజన్ 2050 లక్ష్యంతో రూపకల్పన
– పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో త్వరలో ఫ్రెండ్లీ ఇండిస్టీ పాలసీ తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఎఫ్టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులతో బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ముఖా ముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారనీ, ఆ మేరకు మార్పు తీసుకొచ్చి చూపిస్తామని స్పష్టం చేశారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ముందుకెళ్తామని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనల మేరకు దేశంలోనే గొప్ప విజన్తో 2050 మోడల్ను అమలు చేస్తామని చెప్పారు. ఎయిరో స్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇక్కడ శక్తివంతమైన ఎయిరో స్పేస్ ఎకోసిస్టమ్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.