– జీఓ ఎం.ఎస్ నం.4పై శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్
క్రీడారంగంలో మెరుగైన ఫలితాలు, క్రీడాకారుల ఉజ్వల భవిత దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలు జీఓ ఎం.ఎస్ నం.4 ప్రకారం ప్రభుత్వ రూపొందించిన నిబంధనలు పాటించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం, పలు క్రీడా సంఘాల ప్రతినిధులతో సోమవారం ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో శాట్స్ చైర్మెన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘మెరుగైన క్రీడా ఫలితాలు, క్రీడాకారుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పథకాలు అథ్లెట్లకు చేరేందుకు జీఓ ఎం.ఎస్ నం.4 అమలు అనివార్యం. ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు రాష్ట్రంలోని క్రీడాకారులు అందరికీ చేరాలి. అందుకోసం క్రీడా సంఘాలు తమ వంతు బాధ్యత పోషించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, అవసరమైన అన్ని పత్రాలను శాట్స్కు సమర్పించాలి. క్రీడా సంఘాల్లో సమస్యల పరిష్కారానికి శాట్స్ చొరవ తీసుకుంటుందని’ ఆంజనేయ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఒలింపిక్ సంఘం, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, శాట్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.