నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న లచ్చిరెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ స్పౌజ్ ఫోరం చేరింది. ఆయన నాయకత్వంపై ఉన్న పూర్తి విశ్వాసం, క్రియాశీల కార్యదక్షత ఉద్యోగ వర్గానికి మార్గనిర్దేశం చేయనుంది. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మాత్రమే సరైన వేదిక అని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పౌజ్ ఫోరం నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగ దంపతులున్నారు. భర్త ఒక చోట పనిచేస్తుండగా, భార్య మరో చోట విధుల్లో ఉన్నారు. దంపతులుగా ఉన్న ఉద్యోగుల హక్కులు, వాటి పరిరక్షణ, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మెన్ లచ్చిరెడ్డికి వారు వివరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననీ, సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కె రామకృష్ణ, చంద్రకంటి శశిధర్, తెలంగాణ స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వివేక్, ప్రధాన కార్యదర్శి గడ్డం కృష్ణ, రాష్ట్ర కోఆర్డినేటర్ సోమయ్యగారి నరేష్, నాయకులు విజయలక్ష్మి, వనజ, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.