– పి.డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా శ్రీ చైతన్య స్కూల్స్ ను నిర్వహిస్తూ, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్ ను వెంటనే అరెస్టు చేయాలని పి.డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో సూర్యాపేట శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ అక్రమంగా విద్యా సంస్థలను నడుపుతున్నాడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనుమతులు లేకుండా పాఠశాలలు నడుపుతూ విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు. ఒకొక్క అడ్మిషన్ కు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ దానికి తగిన విధంగా సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. ఇటీవలే సిద్దిపేట చిన్నపిల్లలు ఉంటున్న హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు అనేక అవస్థలు పడ్డారన్నారు. అడ్మిషన్ ఫీజు మాత్రమే కాకుండా రవాణాపు, బుక్స్ , డ్రెస్ ల పేరుతో ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తూ ఫీజుల దందాను చేస్తున్నారన్నారు. విద్యాశాఖ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదన్నారు. ఖమ్మం నగరంలో అనేకమంది విద్యార్థులు శ్రీచైతన్య పాఠశాలల్లో చదివి, వారు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ, ఈడి, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ చేపించాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలన్నారు. కరీంనగర్ లో పి.డి.ఎస్.యు జిల్లా రాణా ప్రతాప్ , మరియు ఎనిమిది మంది విద్యార్థి నాయకులకు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థలు మూతపడేంతవరకు పి.డి.ఎస్.యు చేస్తుందని దానికి దశలవారీగా ఉద్యమిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, నాయకులు, అభి, గోపి, మహేష్, నవీన్,పవన్, వినయ్, ప్రవీణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.