‘వానాకాలం సాగు’పై జూన్‌ 9న రాష్ట్ర సదస్సు

– జయప్రదం చేయండి : టి. సాగర్‌, అరిబండి ప్రసాద్‌రావు పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘వానాకాలం సాగు’పై జూన్‌ 9న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, అరిబండి ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అరిబండి ప్రసాద్‌రావు తెలిపారు. అరిబండి లక్ష్మినారాయణ 6వ స్మారకోపన్యాసం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాటర్‌ టెక్నాలజీ సెంటర్‌ ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, అరిబండి ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అరిబండి ప్రసాద్‌రావు, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, నాయకులు అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెమినార్‌లో నార్మ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, యూనివర్సిటీ మాజీ డైరెక్టర్‌ రాజిరెడ్డి,రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అల్దాఫ్‌ జానయ్య తదితరులు ప్రసంగించనున్నారు. అరిబండి ఫౌండేషన్‌, తెలంగాణ రైతు సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును రైతులు జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.