నవతెలంగాణ – సిద్దిపేట
3 నెలల వయస్సున్న చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడటంతో, ఆ పాపను ఎత్తుకొని ఇంకా పేరు పెట్టని ముద్దులోలుకుతున్న ఆ చిన్నారికి శ్రీజ అని పేరు పెట్టి , శ్రీజ ముఖంలో ఎప్పటికి చిరునవ్వులు తొలగని విదంగా తల్లిదండ్రులు లేని లోటు కనబడకుండా, ఆనందంగా పెరిగి, నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించేలా శిశు గృహ అధికారులు ఉన్నంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచిస్తూ, శ్రీజను మంత్రి ఆశీర్వదించారు. శనివారం రాష్ట్ర ఆర్థిక,వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహను ప్రారంభించారు. ఈ సందర్భంగా శిశు గృహలో అనాధ శిశువులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోని ఇలాంటి అనాధ పిల్లలకు సేవచేయడం ప్రజా ప్రతినిధులుగా మాకు చాలా సంతృప్తిని ఇస్తుందని, అనాధ శిశువులందరినీ శిశు గృహ అధికారులు సొంత బిడ్డల లాగా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తదితరులు పాల్గొన్నారు.