గోల్కొండ కోటలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ తరుపున శుక్రవారం గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకులను నిర్వహించ నున్నట్టు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం గోల్కొండ కోటలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆజాదీకా అమృత్‌ మహౌత్సవంలో భాగంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడం తోపాటు.. సాయుధ బలగాల పరేడ్‌ జరగనుందని తెలిపారు. అనంతరం శంకర్‌ మహదేవన్‌, డాక్టర్‌ ఆనంద శంకర్‌ బృందం, మంజులా రామస్వామి బృందంతో ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలుంటా యన్నారు.
మంగ్లీ, మధుప్రియలు తెలంగాణ సాంప్రదాయాన్ని, ఉద్యమాన్ని ప్రతిబింబించే పాటలు పాడతారని తెలిపారు. పాఠశాల విద్యార్థుల కోసం ‘ఖిలా ఔర్‌ కహానీ’ థీమ్‌ తో ‘పెయింటింగ్‌, ఫొటో’ పోటీలు నిర్వహిం చామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ హాజరవుతారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర మరువేనిదని చెప్పారు.