బీజేపీ అభ్యర్ధి ర్యాలీలో కార్లపై రాళ్ళు

ముజఫర్‌నగర్‌ (యూపీ) : బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కొంతమంది వ్యక్తులు రాళ్ళు విసిరి, అనేక కార్లను ధ్వంసం చేశారు. ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఖతౌలి ఏరియాలో బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి, కేంద్ర మంత్రి సంజీవ్‌ బాల్యన్‌కి మద్దతుగా ర్యాలీ జరిగింది. సభలో బాల్యన్‌ ప్రసంగిస్తుండగా, ఆ సమీపంలో పార్క్‌ చేసిన కార్లు ధ్వంసం చేయబడ్డాయి. దీనిపై నగర అదనపు ఎస్‌పీ సత్యనారాయణ ప్రజాపత్‌ మాట్లాడుతూ, శనివారం రాత్రి సభలో బాల్యన్‌ మాట్లాడుతుండగా, కొన్ని అవాంఛనీయ శక్తులు అనేక వాహనాలపై రాళ్ళు విసిరాయని, కార్ల కిటికీలు పగలగొట్టాయని చెప్పారు. దాడికి పాల్పడినవారు నినాదాలు కూడా చేశారని తెలిపారు.దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌ సైనీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.