
– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా..
నవతెలంగాణ – వేములవాడ
ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందు లేకుండా సమృద్ధిగా సరఫరా చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రవరం ఇంటెక్ వెల్, అగ్రహారం నీటి శుద్ధి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మిషన్ భగీరథ ఈఎన్సి కృపాకర్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు జలాశయం (శ్రీ రాజ రాజేశ్వర జలాశయం) లో నీటి నిలువ పూర్తి స్థాయి సామర్ధ్యం 27.50 టీఎంసీ గాను ప్రస్తుతం 5.90 టీఎంసీ కి తగ్గడం వలన ఈ వేసవి లో మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. మిషన్ భగీరథ నీటి అవసరాలు, ప్రస్తుతం జలాశయంలో అందుబాటులో ఉన్న నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ అధికారులు ప్రస్థుతం ఈ వేసవి కాలం మిషన్ భగీరథకు మూడు నేలల కాలానికి 0.36 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని, ప్రస్తుతం జలాశయంలో త్రాగు నీటి కోసం మొతం 4 టిఎంసీల వరకు లభ్యత ఉందని తెలిపారు.
ప్రతి గ్రామమునకు అవసరమైన మేరా సమృద్ధిగా త్రాగునీటి సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులను పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. అలాగే అగ్రహారం లోని నీటి శుద్ధి కేంద్రమును సందర్శించారు. అనంతరం వేములవాడలోని రాజన్న ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మిషన్ భగీరథ శాఖ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ గౌతమి లతో కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేశారు. ఆలయ పర్యవేక్షకులు శేష వస్త్రము, లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వెంట అదనపు కలెక్టర్ గౌతమి పూజారి, మిషన్ భగీరథ, సిఇ అమరేంద్ర, ఎస్ ఈ రవీందర్, ఈఈలు విజయ్ కుమార్, జానకి , ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, స్థానిక తహసిల్దార్ మహేష్, సంబంధిత అధికారుల తోపాటు తదితరులు పాల్గొన్నారు.