నవతెలంగాణ – కామారెడ్డి
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని కట్టుదిట్టంగా నిర్వహించాలని, జిల్లాలో అవసరమైతే అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర సి.ఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎల్.ఆర్.ఎస్, భారీ వర్షాలు, ధరణి, ఆర్.ఓ.ఆర్ చట్టం పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్.ఆర్.ఎస్ సంబంధించి దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని , వీటి స్క్రూటినీ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం స్క్రూటినీ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి సకాలంలో పూర్తి చేయాలని, అవసరమైతే జిల్లాలో అదనపు సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని మంత్రి సూచించారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులలో అవసరమైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించాలని, జిల్లాలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ప్రకారం అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి వారు వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేసేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సర్వే నెంబర్ వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం,మున్సిపాలిటీ లలో బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జిపిఎస్ ద్వారా సదరు భూమి కో ఆర్డినేట్స్ పక్కాగా నమోదు చేస్తారని, అదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్ , నాలా, చెరువులు ,హెరిటేజ్ బిల్డింగ్ ,డిఫెన్స్ ల్యాండ్ పరిధిలోవి కావని ధ్రువీకరించాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ 3 నెలలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ ద్వారా ఎక్కడ ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని, అదే విధంగా నీటి వనరులు, కాలువలు, చెరువుల ఆక్రమణలకు పాల్పడలద్దని అధికారులకు సూచించారు. రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, నీటి వనరుల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని అన్నారు.
ధరణి పోర్టల్ లో పెండింగ్ ఉన్న దరఖాస్తుల స్క్రుటిని పూర్తి చేసి పరిష్కరించాలని, తిరస్కరించే దరఖాస్తులకు సదురు కారణాలు తెలియజేయాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం ముసాయిదా బిల్లు ప్రతి పాదించిందని, దీని పై జిల్లా లలో ఆగస్టు 23,24 తేదీలలో వర్క్ షాప్ నిర్వహించి, ముసాయిదా బిల్లులో చేయాల్సిన మార్పులు, మెరుగైన సూచనలు ఏవైనా ఉంటే ఫీడ్ బ్యాక్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అందజేయాలని మంత్రి సూచించారు. జిల్లాలోని పోచారం, నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టుల్లో నీటి మట్టం వివరాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. ముందస్తుగా వారిని అప్రమత్తం చేయాలన్నారు. జ్వరాలు వ్యాప్తి చెందే గ్రామాలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామాల్లోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ఆరోగ్య, ఆశ కార్యకర్తలతో గ్రామీణులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామీణులు చెత్త బండికి ఇచ్చే విధంగా చూడాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని అధికారులు తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేయించాలని చెప్పారు. ధరణిలో పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ ఎస్.ఈ. శ్రీనివాస్, ఇన్చార్జి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్, పర్యవేక్షకులు ప్రేమ్ కుమార్, ఉమలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.