గణపతి నిమజ్జన ఉత్సవానికి పటిష్ట బందోబస్తు

Adilabad– మల్టీ జోన్‌ వన్‌ ఐజి ఎస్‌.చంద్రశేఖర్‌ రెడ్డి
– ఎస్పీతో కలిసి సిబ్బందికి దిశా నిర్దేశం
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ టౌన్‌
గణపతి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మల్టీ జోన్‌ వన్‌ ఐజి ఎస్‌. చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. ముందుగా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం ద్వారా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ గౌష్‌ ఆలంతో కలిసి డిఎస్పి లకు సీఐలకు గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మల్టీ జోన్‌వన్‌ ఐజి ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేసుకున్నందుకు అదే విధంగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. ఎటువంటి అత్యవసర సమయంలోనైనా జిల్లా పోలీస్‌ యంత్రాంగం 24 గంటలు అప్రమత్తమై అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో విధులను నిర్వర్తిస్తుందని, నిమజ్జన కార్యక్రమానికి 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ప్రత్యేకంగా 11 సెక్టార్లను విభజించి ఎస్సై స్థాయి అధికారులను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఏడు క్లస్టర్లను విభజించి సిఐ స్థాయి అధికారులతో పెట్రోలింగ్‌ గస్తీ నిర్వహిస్తూ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో, జిల్లా వ్యాప్తంగా 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని వీడియోగ్రఫీ ద్వారా ప్రత్యక్షంగా 24 గంటలు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 1600 గణపతి విగ్రహాల జియో టాగింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్‌ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్‌, ఎల్‌ జీవన్‌ రెడ్డి, డి సురేందర్‌ రెడ్డి, ప్రసాద్‌, వన్‌ టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌, కరుణాకర్‌, శ్రీనివాస్‌, ప్రణరు కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.