కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం

– మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయించినట్టు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానంతరం సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వి. హనుమంతరావు, మధుయాష్కీగౌడ్‌, సంపత్‌కుమార్‌, బలరాంనాయక్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలిపిందన్నారు. మహాత్మ గాంధీ ఆలోచనలను కొత్త తరానికి తెలియజేసేందుకే (జనవరి 2025-జనవరి 2026) ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కుల గణనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీ వేణుగోపాల్‌ అభినందించారని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు ఇవ్వాలని సూచించారని తెలిపారు. త్వరలోనే పార్టీ పదవులు, కార్పొరేషన్‌ చైర్మెన్‌లు భర్తీ చేస్తామన్నారు. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.