నవతెలంగాణ -పెద్దవంగర: విద్యార్థులకు సంబంధించిన యూ డైస్, ఎఫ్ఆర్ఎస్ వివరాలను పక్కాగా నమోదు చేయాలని పెద్దవంగర, చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బుదారపు శ్రీనివాస్, ఆర్రోజు విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో యూ డైస్, ఎఫ్ఆర్ఎస్ పై అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి హాజరును ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)తో నమోదు చేయాలన్నారు. ఉపాధ్యాయుల వద్ద ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్, ట్యాబ్ల ద్వారా విద్యార్థుల ముఖాలను స్కాన్ చేస్తేనే హాజరు నమోదు అవుతుందని చెప్పారు. తద్వారా బోగస్ హాజరు నమోదును అరికట్టేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు యూ డైస్ లో ఎలా నమోదు చేయాలి, తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.