– కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న జనం
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
కాంగ్రెస్ ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం ఐదు గ్యారంటీ పథకాల్లో గృహాజ్యోతి పథకం ఒకటి. ఈ పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లును ఉచితంగా అందజేస్తోంది. ఈ పథకాలకు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించింది. ప్రజలు కూడా తమ మీటర్ల నంబర్లను రాసీ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా సమర్పించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంలో భారీగా తప్పిదాలు జరిగాయి. దీంతో వినియోగదారులకు విద్యుత్ రాయితీ అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో రాయితీ పొందని వారికి విద్యుత్ శాఖ అధికారులు నెలనెల బిల్లును అందిస్తున్నారు. మండలంలోని ఫడ్ రాజు, కాంబలే ప్రభావతి, శంకర్ గూడకు చెందిన లక్ష్మీ కాంత్కు గృహాజ్యోతి పథకం కింద రాయితీ రాకా పోవడంతో మండల కేంద్రంలో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు ఆన్లైన్లో సరి చూడగ కొందరి పేర్లు నమోదు కాలేదని తెలిసింది. మీటర్ నంబర్ నమోదు చేయలేదని చెబుతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. పొరపాట్లను సరిచేయాల్సిన అధికారులు మాత్రం తామేమీ చేయలేమని, పై అధికారుల నుంచి తమకెలాంటి ఎడిట్ ఆప్షన్ రాలేదని సమాధానం చెబుతున్నారు. దీంతో రాయితీ అందని లబ్దిదారులు ఎవరికి చెప్పాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పైన తెలిపిన బాధితులు కొందరు మాత్రమే. ఇలాంటి రాయితీ అందని వినియోగదారులు మండలంలో పదుల సంఖ్యలో ఉన్నారు. తప్పులను సరవించి పేదలకు పథకం వర్తించేల చూడాలి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు గృహజ్యోతి వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.