అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన, దర్శకత్వంలో రాజు మల్లియాత్, రారు సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఐడెంటిటీ’. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది తొలి హిట్ సినిమాగా నిలిచింది. ఈచిత్రాన్ని మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ఈనెల 24వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు టైలర్ను సోమవారం లాంచ్ చేశారు. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో యాక్షన్ కంటెంట్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం మలయాళంలో విశేష ఆదరణ పొందింది. తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఈ నూతన సంవత్సరంలో సంచలన వసూళ్ళుతో గొప్ప విజయం సాధించిందీ సినిమా. ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను సైతం కచ్చితంగా వినోదపరుస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని చింతపల్లి రామారావు అన్నారు.