– నామినేట్ చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోడీ ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని కొనియాడారు. ”సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కషి అపారం, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్ అవడం ‘నారీశక్తి’కి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి” అని మోడీ ఆకాంక్షించారు.
డబుల్ సర్ప్రైజ్: సుధామూర్తి
రాజ్యసభకు నామినేట్ అవడంపై సుధామూర్తి ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం థాయ్ లాండ్ పర్యటనలో ఉన్న ఆమె పీటీఐతో ఫోన్లో మాట్లాడారు. ”మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్ సర్ప్రైజ్. చాలా ఆనందంగా ఉంది. ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిజానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఏనాడూ పదవులు కోరుకోలేదు. ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదు. అయితే, దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యత అని నమ్ముతున్నా” అని ఆమె పేర్కొన్నారు.73 ఏండ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్’కు చైౖర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్నాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.