ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో నూతన రికార్డ్లను నమోదు చేస్తున్నాయి. మంగళవారం సెషన్లోనూ కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 274 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 65,479కి చేరింది. ఇంట్రాడేలో ఏకంగా 500 పాయింట్ల మేర పెరిగి 65,672 మార్క్ను తాకింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 66.45 పాయింట్లు లాభపడి 19,389 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపరుల కొనుగోళ్ల మద్దతు సూచీల లాభాలకు దోహదం చేశాయి. సెన్సెక్స్-30లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, ఎన్టిపిసి షేర్లు అధికంగా లాభపడిన వాటిలో టాప్లో ఉన్నాయి.