అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నిందితుల అరెస్టు

– రూ.24 లక్షల విలువగల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు.. ఒక కియా కారు స్వాధీనం
– నిందితుల అరెస్టు , రిమాండ్‌కు తరలింపు
– వివరాలు వెల్లడించిన డీసీపీ రాజేష్‌చంద్ర
నవ తెలంగాణ- భువనగిరి రూరల్‌
గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు డీసీపీి రాజేష్‌ చంద్ర తెలిపారు. సోమవారం డీసీపీ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉస్మానాబాద్‌కు చెందిన రాజు షిండే, సంజయి చవాన్‌, శ్రావణ్‌ చున్ని లాల్‌ శర్మ, రాహుల్‌ శిండే లు అదే రాష్ట్రానికి చెందిన ముక్తార్‌ సూచన మేరకు గంజాయిని తరిలిస్తూ ఉండేవారు. గంజాయిని తరలిస్తున్న క్రమంలో నలుగురిని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో గంజాయిని తీసుకొని రావాలని చెప్పాడు. ఆ నలుగురు అక్కడ గంజాయి తీసుకొని కారులో మహారాష్ట్రకు వెళ్లేందుకు బయలుదేరారు. బయలుదేరిన క్రమంలో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈనెల 28న రామన్నపేట పట్టణ కేంద్రంలో భువనగిరి – చిట్యాల రోడ్డు మార్గంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద భువనగిరి ఎస్‌ఓటి పోలీసులతోపాటు రామన్నపేట పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో వాహనాలు తనఖి చేపట్టారు. అనుమానం వచ్చిన కారును ఆపి అందులో ప్రయాణిస్తున్న నలుగురిని విచారించారు. అనుమానాస్పదంగా మాట్లాడడంతో కారులో గంజాయి ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేసి, పోలీస్‌ స్టేషన్కు తరలించారు. వారి నుంచి సుమారు 24 లక్షల విలువ చేసే 120 కిలోల 60 గంజాయి ప్యాకెట్లు, మూడు సెల్‌ ఫోన్లు, ఒక కియా కారు ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి సోమవారం వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అంతరాష్ట్ర గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యులు తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో గంజాయి సరఫరా చేస్తూ ఇతరుల సూచన మేరకు అందజేస్తుంటారు. ఎవరి సూచన మేరకు వీరు గంజాయి సరఫరా చేస్తున్నారో దర్యాప్తు చేస్తున్నట్లు, త్వరలోనే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్‌ ఏసీపీి ఉదరు రెడ్డి, రామన్నపేట సిఐ మోతీరం, ఎస్‌ ఓటి సిఐ నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు.