డిప్యూటీ తహసిల్దార్ సస్పెన్షన్

– భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వేటు
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా గుర్రంపోడు డిప్యూటీ తహసీల్దార్ ఎం.డి ఫరీదుద్దీన్ ను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని అక్రమంగా మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో బాధిత మహిళ గురువారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ తక్షణమే విచారణ జరిపారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో బాధ్యుడైన డిప్యూటీ తహసీల్దార్ ఫరీదుద్దీన్ పై సస్పెన్షన్ వేటు పడింది. 2018లో జలగం లలితమ్మ తన పెద్ద కూతురు ఉజ్జిని కవిత చిన్న కూతురు కు ఇనుపాముల నాగమణికి ఒక్కొక్కరికి  4.18 ఎకరాల భూమిని దేవరకొండ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసింది. చిన్న కూతురు నాగమణి మ్యుటేషన్ చేయించుకో కపోవడంతో ఆ భూమి సదరు రైతు లలితమ్మ పేరు మీదనే రికార్డులో ఉంది. ఆ భూమిలో ఎకరం మిస్సింగ్ లో ఉండగా మిగతా 3.18 ఎకరాల భూమి అప్పట్లో తన తల్లి దగ్గర నుంచి కుమారుడు జలగం చంద్రశేఖర రావు కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగింది. తాను రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని తన  ప్రమేయం లేకుండా ఆ భూమిని రెండోసారి రిజిస్ట్రేషన్ చేయడం పై కవిత కోర్టును ఆశ్రయించగా యధాతధ స్థితిలో ఉంచమని కోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఆ భూమిని గత ఏడాది కళ్లెం మంజుల అనే మహిళ కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగింది. తిరిగి గురువారం చంద్రశేఖర రావు కుమారుడు జలగం మధుకు రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో బాధిత మహిళ ఉజ్జిని కవిత ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కలెక్టర్ నారాయణరెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో డిప్యూటీ తహసిల్దార్ పాత్ర ఉందని గుర్తించి సస్పెండ్ చేశారు.